కడప విద్యార్థి ఎవరెస్ట్ పర్వతం అధిరోహించాడు

రాష్ట్రం నుంచి ఎవరెస్ట్‌పై అడుగిడిన తొలి అమ్మాయిలు
గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన జి.పి.హరిప్రసాద్‌(కడప)
అమరావతి: రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. వీరంతా కూలీల బిడ్డలే. ఈ నలుగురిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. రాష్ట్రం నుంచి ఎవరెస్ట్‌పై అడుగిడిన తొలి అమ్మాయిలు వీరే. సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన వి.సంధ్యబాయి(గుంటూరు), బి.రాణి(పశ్చిమగోదావరి), ఆర్‌.సుందర్‌రాజు(కర్నూలు), జి.పి.హరిప్రసాద్‌(కడప)లు సోమవారం ఉదయం ఎవరెస్ట్‌పైకి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3గంటలకు హరిప్రసాద్‌, సుందర్‌రాజు తొలుత ఎవరెస్ట్‌ను అధిరోహించారు. 4గంటల సమయంలో సంధ్యాబాయి, రాణి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వీరితో కలిసి ఇప్పటివరకూ యువజన సంక్షేమ విభాగం, సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన మొత్తం 14మంది విద్యార్థులు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. మొత్తం 19 మంది విద్యార్థులను ఎవరెస్ట్‌ అధిరోహణకు ఎంపిక కాగా.. 14మంది దిగ్విజయంగా దీనిని పూర్తిచేశారు. సంధ్యాబాయి తండ్రి మంగ్యనాయక్‌ కూలి. సంధ్య గుంటూరు జిల్లాలోని విజయపురి సౌత్‌లో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీ బి.దావీదు కుమార్తె రాణి ధర్మాజిగూడెం జె.పి.హెచ్‌.స్కూల్‌లో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. క్రీడలపై ఆసక్తి ఉన్న ఈ ఇద్దరు ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చి.. అనుకున్నట్టుగానే లక్ష్యాన్ని సాధించారు.